ఢిల్లీ సుల్తానత్ యుగం

ఢిల్లీ సుల్తానత్ యుగం
                క్రీ.శ. 1206 నుంచి క్రీ.శ. 1526 వరకు ఉన్న మధ్య కాలాన్ని భారతదేశంలో ఢిల్లీ సుల్తానుల యుగంగా పేర్కొంటారు. ఈ యుగంలో ఉత్తర భారత దేశాన్ని ఢిల్లీ సుల్తానులు పరిపాలించగా దక్షిణ భారతదేశంలో కాకతీయులు, యాదవులు, హోయసాలులు, పాండ్యులు, విజయనగర, బహమనీ రాజ్యాలు; గోల్కొండ కుతుబ్‌షాహీ రాజ్యం ముఖ్యపాత్ర పోషించాయి. అప్పటి ఆర్థిక వ్యవస్థ స్వరూప స్వభావాలను తెలుసుకోవాలంటే ఆయా రాజ వంశాల కాలం నాటి వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమల అభివృద్ధిని అధ్యయనం చేయాలి.

                 రాజపుత్ర యుగంలో క్రీ.శ. 712లో తొలిసారిగా అరబ్బులు అనే మహ్మదీయులు దండెత్తి వచ్చారు. మహ్మద్‌బిన్ ఖాసిం సింధురాజు దాహిర్‌ను ఓడించి రాజ్యాన్ని ఆక్రమించాడు. క్రీ.శ. 1000-1026 మధ్య గజనీ మహ్మద్ అనే తురుష్క పాలకుడు భారతదేశ సిరిసంపదలను దోచుకుపోయాడు. క్రీ.శ. 1175-1205 మధ్య భారతదేశంపై దండెత్తిన ఘోరి మహ్మద్ భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపనకు పునాది వేశాడు. తరైన్ యుద్ధాల్లో పృధ్వీరాజ్ చౌహాన్‌ను, చంద్‌వార్ యుద్ధంలో జయచంద్రుడిని ఓడించి ఆ ప్రాంతాలపై తన ప్రతినిధిగా కుతుబుద్దీన్ ఐబక్‌ను నియమించాడు. 1206లో ఘోరీ మరణించడంతో కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీలో బానిస వంశస్థాపన ద్వారా స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. 1206 నుంచి 1526 మధ్య 'బానిస' , 'ఖిల్జీ ', 'తుగ్లక్' , సయ్యద్ వంశం, 'లోడీ' వంశం అనే అయిదు రాజవంశాలు ఢిల్లీని పాలించాయి.
ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని ఇక్తాలు అనే సైనిక రాష్ట్రాలుగా విభజించి పరిపాలనలో మార్పులు తెచ్చారు. రైతులను దోపిడీ చేసి, అపారమైన నిధులను సమీకరించడం సుల్తానుల ఆర్థిక పాలనలోని ప్రధాన లక్షణం. దానికి అనుగుణంగానే ఢిల్లీ సుల్తానుల ఆర్థిక పాలన కొనసాగింది. ఇల్-టుట్-మిష్ ఇక్తా వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఇక్తా అధిపతి ముక్తీ. అల్లావుద్దీన్ ఖిల్జీ ఇక్తాలను రద్దుచేసి సైనికులకు జీతాలు ఇచ్చే పద్ధతి ప్రవేశపెట్టాడు. కానీ మళ్లీ ఫిరోజ్ షా తుగ్లక్ ఇక్తా పద్ధతినే జాగీర్దారీ పద్ధతిగా ప్రవేశపెట్టి సైనిక పదవులను వంశ పారంపర్యం చేశాడు.
వ్యవసాయ రంగం      ఢిల్లీ సుల్తానులు వ్యవసాయరంగ అభివృద్ధికి కృషి చేశారు. అప్పట్లో 3 రకాల భూములు ఉండేవి. అవి (1) ఖలీసా భూములు, (2) ఇక్తా భూములు, (3) మదద్--మాష్ భూములు. సుల్తాన్ సొంత భూమిని ఖలీసా భూమి అనేవారు. దీనిపై వచ్చే ఆదాయం నేరుగా ఖజానాకు చేరుతుంది. సైనికులకు, ఉద్యోగులకు, ముక్తీలకు ఇచ్చే భూమిని ఇక్తాభూమి అనేవారు. దీనిపై వచ్చే ఆదాయం ఆయా వర్గాలకు చేరుతుంది. కవులు, పండితులు, మత పరమైన వ్యక్తులకు ఇచ్చే భూములను మదద్--మాష్ భూములు అనేవారు. ఖలీసా భూముల నుంచి చౌదరి అనే ఉద్యోగి శిస్తు వసూలు చేసేవాడు. ఇక్తా భూముల్లో ముక్తీకి ఖ్వాజా అనే ఉద్యోగి రెవెన్యూ సహాయకుడిగా ఉండేవాడు. బాల్బన్ తొలిసారిగా అడవులను నరికించి వ్యవసాయ భూమిగా మార్చాడు. ఆర్థిక శాఖ (దివాన్--విజారత్) నుంచి సైనిక శాఖ (దివాన్--అర్జ్)ను వేరుచేశాడు. రెవెన్యూ విధానంలో ఢిల్లీ సుల్తానులు అనేక సంస్కరణలు అమలు చేశారు. అల్లావుద్దీన్ ఖిల్జీ దివాన్--మస్తక్‌రాజ్ అనే రెవెన్యూ శాఖను ఏర్పాటు చేసి రెవెన్యూ అవినీతిని నిర్మూలించాడు.
అప్పటి వ్యవసాయ ఉత్పత్తుల ధరల గురించి జియావుద్దిన్ బరనీ పేర్కొన్నాడు. బిస్వ (Biswa) అనే ఉద్యోగి భూమి కొలత ఆధారంగా రాబడిని బట్టి పన్ను విధించేవాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ భూమి శిస్తును 1/2వ వంతు (50%)కు పెంచాడు. దానం చేసిన సారవంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకుని ఖలీసా భూములుగా మార్చాడు. భూమిశిస్తును ధన, ధాన్యరూపాల్లో చెల్లించడానికి అంగీకరించాడు. భూమి శిస్తు వసూలు చేయలేని అమీల్స్, కార్కూన్స్ అనే అధికారులను దండించాడు. వ్యవసాయానికి నీటి సౌకర్యం కల్పించడం కోసం తొలిసారిగా నీటి పారుదల కాలువను తవ్వించింది ఘియాజుద్దీన్ తుగ్లక్ అని బరనీ పేర్కొన్నాడు. ఇతడి కాలంలో భూమిశిస్తు 1/10వ వంతు వసూలు చేసేవారు.
       మహ్మద్‌బిన్ తుగ్లక్ కాలంలో దివాన్--కోహి అనే ప్రత్యేక వ్యవసాయ శాఖను ఏర్పాటు చేశారు. గంగా యమునా అంతర్వేదిలో భూమిశిస్తు పెంచారు. ఇతడి కాలంలో కూడా భూమిశిస్తు 1/2 వంతు (50%)కు పెంచారు. తుగ్లక్ ద్రాక్ష, ఖర్జూర పండ్లను పండించడానికి రైతులకు ప్రత్యేక వసతులు కల్పించాడు. వారికి తక్కావీ రుణాలు మంజూరు చేశాడు. 1325-27లో గంగా-యమునా అంతర్వేదిలో భయంకరమైన క్షామం సంభవించింది. అయినా సుల్తాన్ శిస్తు తగ్గించలేదు. రైతు బాంధవుడిగా పేర్కొందిన ఫిరోజ్ షా తుగ్లక్ వ్యవసాయాభివృద్ధికి నాలుగు ప్రధాన నీటికాలువలను తవ్వించాడు. సట్లెజ్-ఘగ్గర్, ఫిరోజ్‌పూర్-ఘగ్గర్, యమునా-ఫిరోజ్‌పూర్, మాండవి-హిస్సార్ కాలువలు ఫిరోజ్‌షా తుగ్లక్ కాలంలో నిర్మితమయ్యాయి. కానీ ఫిరోజ్‌షా తుగ్లక్ తక్కావీ రుణాలును రద్దు చేశాడు. కాలువల నీటిని వాడుకున్నందుకు 1/10 వంతు నీటి పన్నుగా 'ష్రబ్‌'ను వసూలు చేశాడు. ఘియాజుద్దీన్ తుగ్లక్ కాలంలో పంట విభజన పద్ధతి ప్రవేశపెట్టారు.
ఇబన్ బటూట రచనల ప్రకారం నీటి పారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో సంవత్సరానికి మూడు పంటలు పండిచినట్లు తెలుస్తోంది. నాటి ప్రధాన వ్యవసాయ ఉత్పత్తుల గురించి విదేశీ యాత్రికులు తమ  రచనల ద్వారా వివరించారు. ఫిరోజ్‌షా తుగ్లక్ హిస్సార్, ఫిరోజాబాద్‌లలో కాలువలు తవ్వించిన తర్వాత అక్కడ గోధుమ, చెరకు పంటల ఉత్పత్తి అధికమైంది. సర్సూతిలో వరి, కనోజ్‌లో పంచదార (చెరకు), ధార్‌లో గోధుమలు, తమలపాకులు; మలబార్‌లో సుగంధ ద్రవ్యాలు అధికంగా పండేవి. విదేశీయులు మలబార్‌ను మిరియాల దేశంగా వర్ణించారు. నాటి ప్రధాన పంట కాలాలైన ఖరీఫ్, రబీ పంట కాలల ల గురించి ఇబన్ బటూటా వివరించాడు. ఢిల్లీకి చెందిన థక్కుర పెరూ (Thakkura peru) అనే రచయిత ఆ కాలంలో 25 రకాల వ్యవసాయ పంటలు పండించేవారని పేర్కొన్నాడు. ఢిల్లీ సుల్తానత్ యుగంలో పండ్ల తోటలు విపరీతంగా సాగయ్యేవి. వరి, గోధుమ, జొన్న, చెరకు లాంటి పంటలు అధికంగా పండించేవారు. ఫిరోజ్ షా తుగ్లక్ తవ్వించిన నీటి పారుదల కాలువల గురించి సమకాలీన ముస్లిం చరిత్రకారుడైన సుయాన్ తెలియజేశాడు. పొలాలకు నీటి సరఫరా చేసేందుకు సుల్తానులు ధీమడులను, పర్షియన్ చక్రాలను దానం చేసినట్లుగా శాసనాలు వివరిస్తున్నాయి. మామిడిపండ్లు అధిక ధరను కలిగి ఉండేవని ఇబన్ బటూట పేర్కొన్నాడు. ఫిరోజ్ షా తుగ్లక్ ఏడు రకాల పండ్లనిచ్చే 12 వందల ద్రాక్ష తోటలను రాజ్యంలో నాటించాడని, వాటి ద్వారా ఖజానాకు సాలీనా 1,80,000 టంకాల ఆదాయం వచ్చేదని చరిత్రకారులు పేర్కొన్నారు. సుల్తానత్ కాలంలో రైతులు దైన్యస్థితిని ఎదుర్కొన్నారు. అధిక పన్నులతో, రుణ భారంతో కుంగిపోయారు. ''సుల్తాన్ కిరీటంలోని ప్రతీ ముత్యం పేదరైతు కన్నీటి నుంచి రాలి ఘనీభవించిన రక్తపు బిందువే" అని అమీర్ ఖుస్రూ నాటి రైతుల పరిస్థితిని వివరించాడు. రైతులు అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల వల్ల అనేక ఇబ్బందులు పడేవారని హలాయుధుడు 'అభిదాన రత్నమాల' అనే తన గ్రంథంలో వివరించాడు .
పన్నుల వ్యవస్థ:
        
ఢిల్లీ సుల్తానులు మొదట ఖురాన్ ఆమోదించిన, అనుమతించిన జకాత్, జిజియా, ఖరాజ్, ఖామ్స్ అనే నాలుగు పన్నులను మాత్రమే వసూలు చేసేవారు. ధనవంతులైన ముస్లింలు చెల్లించే ఆస్తి పన్ను జకాత్. ఇది 1/10వ వంతు ఉండేది. ముస్లిమేతరులు చెల్లించే మత పరమైన పన్ను జిజియా. అయితే మహిళలు, మైనర్లు, బుద్దిమాంద్యులు, బౌద్ధులు, పూజారులను జిజియా పన్ను నుంచి మినహాయించారు. ఖరాజ్ అనేది అన్ని వర్గాల వారి నుంచి వసూలు చేసే భూమిశిస్తు. దీని ద్వారానే ప్రభుత్వానికి అధిక ఆదాయం లభించేది. ఇది కూడా పంటలో 1/10వ వంతుగా ఉండేది. కానీ అల్లావుద్దీన్ ఖిల్జీ, మహ్మద్ బీన్ తుగ్లక్‌ల కాలంలో భూమిశిస్తు 1/2కు పెంచారు. యుద్ధ సొమ్ములో వాటానే ఖామ్స్ అంటారు. ఇది 1/5వ వంతుగా ఉండేది. ఇతర రాజ్యాలపై యుద్ధంచేసి తీసుకువచ్చిన ధనంలో సైనికులు, ప్రభుత్వం వాటాలుగా పంచుకునేవారు. క్రమంగా సుల్తానులు అనేక ఇతర పన్నులను కూడా ప్రవేశపెట్టారు. నీటి పన్నుగా 1/10వ వంతు వసూలు చేసేవారు. దీనినే ఉషర్, ష్రబ్ (షరబ్) అనేవారు. పచ్చిక బయళ్లు, పశువులపై 'చరాయి', ఇండ్లపై 'ఘరి', గుర్రాలపై 'అబ్‌వాబ్స్' అనే పన్నులను వసూలు చేసేవారు. (నోట్: ఉషర్ అనేది ముస్లిం రైతుల నుంచి, షరబ్/ష్రబ్ అనేది ముస్లిమేతర రైతుల నుంచి వసూలు చేసే నీటి పన్నుగా ఆధునిక చరిత్రకారులు అభివర్ణిస్తున్నారు).
ద్రవ్యవ్యవస్థ - నాణేల ముద్రణ        ఢిల్లీ సుల్తానులు ద్రవ్యవ్యవస్థలో కాలానుగుణంగా అనేక మార్పులను చేశారు. ఇల్ టుట్ మిష్ టంకా (వెండి నాణేలు), జిటాల్ (రాగి నాణేలు) లను ప్రవేశపెట్టాడు. మహ్మద్ బీన్ తుగ్లక్‌ను నాణేల యువరాజు (ప్రిన్స్ ఆఫ్ మనీయర్)గా పేర్కొంటారు. ఇతడి కాలంలో లోహాల కొరత వల్ల టోకెన్ కరెన్సీని ముద్రించారు. వీటినే భిరంజ్ నాణేలు అంటారు. నాణేలను ప్రభుత్వమే ముద్రించాలనే నియమం ప్రవేశపెట్టకపోవడంతో రాజ్యమంతటా నకిలీ నాణేలు విపరీతంగా ముద్రించారు. ఫలితంగా ద్రవ్య సరఫరా పెరిగిపోయి ద్రవ్యోల్బణ పరిస్థితులు తలెత్తాయి. సుల్తాన్ వెంటనే టోకెన్ కరెన్సీని రద్దుచేశాడు. ప్రజలంతా బాధలు పడుతున్నారని గ్రహించిన తుగ్లక్ అసలు, నకిలీ అనే తేడా లేకుండా ప్రజల వద్ద ఉన్న టోకెన్ కరెన్సీకి బదులుగా తన ఖజానాలోని సొమ్మును మొత్తం సరఫరా చేసి ఖజానా మొత్తం ఖాళీ అయ్యేలా చేశాడు. కాబట్టి చరిత్రకారులు అతడిని పిచ్చి తుగ్లక్‌గా పేర్కొన్నారు. మహ్మద్ బీన్ తుగ్లక్ దీనార్ అనే బంగారు నాణేలను, అదిలి అనే వెండి నాణేలను కూడా ముద్రించాడు. ఫిరోజ్‌షా తుగ్లక్ 'అదా', 'బిఖ్' అనే నాణేలను వెండి, రాగి మిశ్రమంతో ముద్రించాడు.
ఇతర ఆర్థిక సంస్కరణలు          ఢిల్లీ సుల్తానులు రాజ్యంలోని ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి అనేక ఇతర సంస్కరణలు అమలు పరిచారు. సుల్తానుల కాలంలో ఆర్థిక మంత్రిత్వ శాఖను దివాన్--విజారత్ అని, ఆర్థిక మంత్రిని 'వజీర్' అని పిలిచేవారు. యుద్ధ/సైనిక మంత్రిని 'దివాన్--ఆర్జ్' అనేవారు. మొదట రెండు శాఖలు కలిసి ఉండేవి.
కాని బాల్బన్ ఈ రెండు శాఖలను వేరు చేశాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్, సైనిక సంస్కరణలు ప్రవేశ పెట్టి ఎంతో ఖ్యాతిని పొందాడు. ఆధునిక రైతు బజార్ వ్యవస్థకు పునాది వేసింది అల్లావుద్దీన్ ఖిల్జీ. మార్కెట్లలో వ్యాపారులు పేర్లు నమోదు (దప్తర్) చేసుకోవడం, ధరల పట్టికను ప్రదర్శించడం, తూనికలు, కొలతల్లో ప్రమాణాలు పాటించడం లాంటి సంస్కరణలను ఖిల్జీ అమలు చేశాడు. వీటి నిర్వహణ కోసం దివాన్--రియాసత్ అనే మార్కెట్ శాఖను, షహనా--మండీ అనే పర్యవేక్షణ అధికారిని ఏర్పాటు చేశాడు. మాలిక్ యాకుబ్ అనే అతడిని రియాసత్ మంత్రిత్వ శాఖకు మంత్రిగా నియమించాడు. జియావుద్దీన్ బరనీ మార్కెట్ సంస్కరణలు దేశమంతటా అమల్లో ఉన్నాయని పేర్కొన్నాడు. కాని ఆధునిక చరిత్రకారులు దీన్ని అంగీకరించలేదు. సంస్కరణలు సైనిక పటాలాలు ఉండే ప్రాంతాల్లో మాత్రమే అమలు చేశారని సిద్ధాంతీకరించారు. నాడు అల్లావుద్దీన్ ఖిల్జీ సైనికులకు ఇక్తా పద్ధతిని రద్దుచేసి నగదు రూపంలో జీతాలు ఇచ్చే పద్ధతిని ప్రవేశ పెట్టాడు. ఒక సైనికుడికి సంవత్సరానికి 234 టంకాలనే జీతంగా ఇచ్చేవాడు. తక్కువ జీతం పొందే సైనికులకు నిత్యావసర సరకులను తక్కువ ధరలకు అందించాడానికే అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ సంస్కరణలు అమలు చేశాడని ఆధునిక చరిత్రకారులు అంగీకరిస్తున్న అంశం. గుర్రాలపై రాజముద్రలు వేసే దాగ్ పద్ధతిని, సైనికులకు హాజరు వేసే చెహ్రా పద్దతిని అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశ పెట్టాడు. ఘియాజుద్దీన్ తుగ్లక్ అంచెలవారిగా గుర్రాల ద్వారా వార్తలు పంపే తపాలా పద్ధతి (అంచె తపాలా పద్ధతి) ని ప్రవేశపెట్టాడు.
melurakam aswam- 100-120 tankalu
aavu10-12 tankalu
stri banisa 20-40 tankalu
purusa banis 20-30tnakalu 
        మహ్మద్ బిన్ తుగ్లక్ చేసిన రాజధాని మార్పిడి ఆర్థిక పరిస్థితిని ఎంతో ప్రభావితం చేసింది. క్రీ.శ. 1327లో తుగ్లక్ తన రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చి దేవగిరి పేరును దౌలతాబాద్‌గా నామకరణం చేశాడు. కానీ తిరిగి 1335 నాటికే రాజధానిని దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి మార్చివేశాడు. దీనివల్ల తీవ్రమైన ఆర్థిక నష్టం సంభవించింది. లేన్‌పూలే చెప్పినట్లు రాజధాని మార్పిడి తుగ్లక్ వృథా ప్రయాసకు చిహ్నంగా నిలిచింది. ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో ప్రజాసంక్షేమాన్ని పెంపొందించడం కోసం దివాన్--ఖైరాత్ అనే సంక్షేమ శాఖను ఏర్పాటు చేశాడు. బానిసల సంక్షేమం కోసం దివాన్--బందగాని అనే శాఖను ఏర్పాటు చేశాడు. దీని ద్వారా 1,80,000 మంది బానిసలను ఖాళీగా ఉంచి పోషించి ఖజానా నష్టపోవడానికి కారకుడయ్యాడు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఉపాధి కల్పన కార్యాలయాన్ని (ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్) స్థాపించాడు. నీటి పారుదలపై పన్ను విధించిన తొలి ఢిల్లీ సుల్తాన్‌గా ఫిరోజ్‌షా తుగ్లక్‌ను పేర్కొంటారు.

పట్టణ ఆర్థిక వ్యవస్థ                  సమకాలీన చరిత్రకారులైన ఇబన్ బటూటా, ఇస్సామీ, జియాఉద్దీన్ బరనీ లాంటి వారి రచనల్లో నాటి పట్టణ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవన విధానాల గురించిన వివరాలు ఉన్నాయి. మహ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో వచ్చిన మొరాకో యాత్రికుడు ఇబన్ బటూటా భారతదేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువుల గురించి, అప్పటి రహదారులు, ప్రజల జీవన పరిస్థితుల గురించి వివరించాడు. మహ్మద్ బిన్ తుగ్లక్ ఇతడిని ఢిల్లీ కొత్వాల్‌గా కూడా నియమించాడు. తూర్పు ఇస్లాం దేశాల్లో ఢిల్లీని మించిన పట్టణం లేదని ఇబన్ బటూటా పేర్కొన్నాడు. దౌలతాబాద్ కూడా ఢిల్లీ అంతటి పెద్ద పట్టణంగా పేరొందింది. వీరి కాలం నాటికే తురుష్కులు మనదేశంలో రాట్నం, కందెన, విల్లు లాంటి నేత కార్మికుల పరికరాలను ప్రవేశపెట్టారు. భారతదేశంలో పట్టుపరిశ్రమను అభివృద్ధి చేసింది కూడా తురుష్కులే. గుజరాత్, బెంగాల్ ప్రాంతాల్లో మేలైన వస్త్రాలు నేసేవారు. బెంగాల్‌లో మాత్రమే ముడి పట్టును ఉత్పత్తి చేసేవారు. కాబట్టి అప్పుడు ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్‌ల నుంచి ముడిపట్టు దిగుమతి చేసుకునేవారు. ఢిల్లీ సుల్తానుల కాలంలోనే భారతదేశంలో కాగితం పరిశ్రమ ప్రారంభమైంది. వీటితోపాటు చక్కెర పరిశ్రమ, తోలు పరిశ్రమ, భవన నిర్మాణ రంగం, లోహ పరిశ్రమలు ఎంతో అభివృద్ధి చెందాయి. ద్రవ్య వినియోగం, బ్యాంకింగ్ సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పరిశ్రమలు స్థాపించారు. అప్పటి పరిశ్రమల (కార్ఖానాలు)ను రెండు రకాలుగా విభజించారు. 1. రతిబి కార్ఖానాలు 2. ఘైర్--రతిబి కార్ఖానాలు. ప్రతిదినం వినియోగించే ఆహార పదార్థాలను (మనుషులు, పశువులకు) సరఫరా చేసే పరిశ్రమలను రతిబి కార్ఖానాలు అని; వస్త్రాలు, పాదరక్షలు, యుద్ద సామగ్రి లాంటి వస్తువులు ఉత్పత్తి చేసే పరిశ్రమలను ఘైర్--రతిబి కార్ఖానాలు అని పిలిచేవారు. బెంగాల్ వస్త్రాల నేతపని ఎంతో ప్రశంసాత్మకమైందని అమీర్ ఖుస్రూ పేర్కొన్నాడు.
అతి తక్కువ ధరలకు నేత వస్త్రాలు బెంగాల్‌లో లభించేవని ఇబన్ బటూటా తెలిపాడు. తూర్పు ఆసియాలోని మలక్కా, పశ్చిమాసియాలోని ఆర్ముజ్‌లలో బెంగాల్ వస్త్రాలకు చక్కని మార్కెట్లు ఉన్నట్లు బార్బోసా వివరించాడు. గుజరాత్‌లోని కాంబే చవకైన, నాణ్యమైన నూలు వస్త్రాలకు పేరుగాంచింది. కాంబేలో ముతక, నాణ్యమైన నేత వస్త్రాలు తయారయ్యేవని బార్బోసా రాశాడు. దేవగిరిలో తయారయ్యే వస్త్రాలను అక్కడి నేర్పరులైన నేతపనివారి గొప్పదనాన్ని అమీర్ ఖుస్రూ పొగిడాడు. మచిలీపట్నంలో రాజులు కూడా గర్వించదగిన వస్త్రాలు రూపొందేవని మార్కోపోలో తన గ్రంథంలో రాశాడు. చైనా నావికుడైన హ్యూయాన్ బెంగాల్‌లోని మల్బరీ చెట్లు, మల్బరీ పురుగులు, పట్టుకాయల గురించి పేర్కొన్నాడు. బంగారు, వెండి జరీతో నేసిన పట్టు తివాచీలకు సూరత్ ఎంతో ప్రసిద్ధి చెందింది. 'పటోలాలు' అనే ప్రత్యేకమైన పట్టు వస్త్రాలకు గుజరాత్ పేరొందింది. ఐరోపా వారు  గ్రాస్‌క్లాత్‌గా అభివర్ణించే టస్సార్ వస్త్రాలకు ఒరిస్సా పేరుగాంచింది. కశ్మీర్ శాలువాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. మహ్మద్ బీన్ తుగ్లక్ కశ్మీర్ శాలువాలను చైనా చక్రవర్తికి కానుకగా పంపించాడు. బయానా ప్రాంతం రంగుల అద్దకంలో ప్రథమ స్థానంలో ఉండేది. నూలు వస్త్రాలకు రంగులు వేసే పరిశ్రమ ఢిల్లీలో అభివృద్ధి చెందింది. మచిలీపట్నం కలంకారీ వస్త్రాలకు ప్రసిద్ధి చెందింది.
          బదౌనీ పండితుడు తన 'టూత్ నామా' గ్రంథంలో అప్పటి తివాచీలను గురించి వర్ణించాడు. ఇరాన్, మధ్యాసియా వారి ప్రభావం తివాచీల తయారీలో కనిపిస్తుంది. దక్షిణ భారతదేశంలో కుట్టుపనివారు ఎంతో ప్రావీణ్యం కలిగి ఉండేవారు. కాకతీయుల కాలంలో కుట్రపువారుగా, విజయనగర సామ్రాజ్య కాలంలో వస్త్ర రక్షకులుగా కుట్టు పనివారు పేరొందారు. బెంగాల్, అజ్మీర్, మాల్వాం ప్రాంతాల్లో చెరకు అధికంగా పండించేవారు. పాట్నాలో అత్యధికంగా ఉత్పత్తి అయ్యే పంచదార బెంగాల్ ద్వారా విదేశాలకు ఎగుమతి అయ్యేదని చైనా నావికుడు హ్యూయాన్ పేర్కొన్నాడు. దక్కన్‌లో బీరార్ చక్కెర పరిశ్రమకు పేరుగాంచింది.

మార్కోపోలో, నికోలాకాంటే లాంటి విదేశీయాత్రికులు నాటి నౌకా పరిశ్రమ గురించి వివరించారు. దాదాపు 300 మంది నడిపే భారీ నౌకలున్నట్లు మార్కోపోలో రాశాడు. భారతీయ నౌకలు తనదేశ నౌకల కంటే పెద్దవని నికోలోకాంటే పేర్కొన్నాడు. కశ్మీర్, సింధు ప్రాంతాల్లో బుట్టలు, పిల్లన గ్రోవులు (Flutes) తయారుచేసే పరిశ్రమలు విరివిగా స్థాపితమయ్యాయి. కాగితం పరిశ్రమ సియోల్ కోట, కాశ్మీర్ ప్రాంతాల్లో అభివృద్ధి చెందింది. అత్యంత శ్రేష్ఠమైన కాగితం కాశ్మీర్‌లో ఉత్పత్తి అయ్యేది. మాన్ సింఘి, ఖర్పూరి, జహంగీరి లాంటి వివిధ రకాల కాగితాలు తయారయ్యేవి. సింధ్, ఢిల్లీ, కాంబే ప్రాంతాల్లో తోలు పరిశ్రమ విస్తరించింది. సింధ్‌లో తయారైన తోలు వస్తువులు మిక్కిలి ప్రసిద్ధి చెందాయి. ఢిల్లీలోని కరోల్‌బాగ్ ప్రాంతం చర్మకారులు పనితనానికి పేరొందింది. కాంబేలో తయారయ్యే పాదరక్షలు అరేబియా లాంటి దేశాలకు ఎగుమతి అయ్యేవి. ఢిల్లీ, ముల్తాన్‌లు దంతపు వస్తువుల తయారీకి ప్రసిద్ధి చెందాయి. సుగంధ నూనెల తయారీకి నోసరి ప్రాంతం, అత్యంత విలువైన సుగంధ నూనెలకు 'అస్సాం' ప్రఖ్యాతి చెందాయి. లక్క పరిశ్రమ గుజరాత్‌లో అభివృద్ధి చెందింది. లోహపు వస్తువులు, పరికరాలు, తుపాకుల తయారీకి సియోల్‌కోట, మేవార్, పల్నాడు, గుత్తికొండ ప్రాంతాలు పేరొందాయి. బంగారం, వెండి, రత్నాలతో పొదిగిన కుండల తయారీకి బీదర్ పేరుగాంచింది. వస్త్ర పరిశ్రమ తర్వాత అప్పట్లో రెండో అతిపెద్ద పరిశ్రమగా భవన నిర్మాణ పరిశ్రమ పేరొందింది. నిర్మాణ రంగంలో వాల్టెడ్ రూఫింగ్ పద్ధతులను ప్రవేశపెట్టారు. సున్నాన్ని సిమెంట్‌లా వాడటం ప్రారంభించారు. ఢిల్లీలోని శిల్పులు, భవన నిర్మాణ కార్మికులు ఇస్లాం రాజ్యాలున్న అన్ని దేశాల కంటే నైపుణ్యం గలవారని అమీర్ ఖుస్రూ వ్యాఖ్యానించాడు. మలబార్ ప్రాంత వర్తకులు సంపన్నులని మార్కోపోలో పేర్కొన్నాడు.
అప్పటి విదేశీ వాణిజ్యం ఎంతో అభివృద్ధి చెందింది. ఎర్ర సముద్రం, పర్షియన్ సింధుశాఖ, ఆగ్నేయాసియా దేశాలకు ఎగుమతులు ఎక్కువగా జరిగేవి. నాణేల చెలామణి ద్వారా అప్పటి వాణిజ్య విస్తరణను తెలుసుకోవచ్చు. తీర ప్రాంతాల్లో, ఉత్తర భారతదేశంలో మార్వాడీలు (జైనులు) ఎంతో పేరొందారు. మధ్యాసియా, పశ్చిమాసియా దేశాలకు భూ మార్గం ద్వారా చేసే వ్యాపారం ముల్తానీల(హిందువులు) ఆధీనంలో ఉండేది. ముస్లిం మతంలోని బోహ్రా శాఖవారు వ్యాపారంలో చురుకుగా పాల్గొనేవారు. జియావుద్దీన్ బరనీ కథనం ప్రకారం ముల్తానీలు చాలా ధనవంతులు. వారు సుల్తాన్లకు, కులీన వర్గాలవారికి అప్పులు ఇచ్చేవారు. ఢిల్లీలోని మార్కెట్ ప్రపంచంలోని అన్ని మార్కెట్ల కంటే పెద్దదని ఇబన్ బటూటా పేర్కొన్నాడు. ఆగ్రాలోని చార్సు బజారులోని బట్టల మార్కెట్ కూడా ఎంతో పెద్దది. ముల్తాన్ అప్పట్లో ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా పేరొందింది. ఢిల్లీకి గుర్రాలు, ఒంటెలను ముల్తాన్ నగరం నుంచే ఎగుమతి చేసేవారు. దేవగిరి ప్రాంతంలో అత్యంత ధనికులైన బనియాలు, సాహూలనే హిందూ వ్యాపార వర్గం ఉండేది. చిన్న వ్యాపార పట్టణాలను కాస్బాలు అనేవారు. బికనీర్, కలనూర్, పానిపట్టు, పాటియాల, సియోల్‌కోట లాంటి కాస్బాలు ఎంతో అభివృద్ధి చెందాయి. నాటి ద్రవ్య విధానంలో దీనార్, సువర్ణ లాంటి నాణేలతోపాటు టంకా, జిటాల్, అదా, భిఖ్, భిరంజ్ లాంటి నాణేలు కూడా సరఫరాలో ఉండేవి. సువర్ణ బంగారు నాణేం 144 గింజల బరువు ఉండేదని చెబుతారు. అన్నింటి కంటే తక్కువ విలువ ఉన్న నాణేలను గవ్వలు అని పిలిచేవారు. ఈ కాలంలో అత్యంత ఎక్కువ చెలామణిలో ఉన్న నాణెం జిటాల్. ద్రవ్య విధానంలో బంగారం, వెండి విలువలు 1 : 10 నిష్పత్తిలో ఉండేవి. ఇల్‌టుట్ మిష్ ముద్రించిన టంకా వెండి నాణెం బరువు 175 ధాన్యపు గింజలకు సమానంగా ఉండేది.
65 జిటాల్ నాణేలు ఒక టంకాకు సమానం. 20 రాగి టంకాలు ఒక వెండి టంకాకు సమానం. రాగి టంకాలను సికిందర్‌లోడ్ ప్రవేశ పెట్టాడు. టంకాలో 1/40 వంతు విలువ కలిగిన బహ్లావి అనే నాణేన్ని బహులాల్ లోడీ ప్రవేశపెట్టాడు. ఈ కాలంలో వడ్డీ వ్యాపారం కూడా అమల్లో ఉండేది. అప్పులిచ్చే కోఠీలు అనే సంస్థలు, షరాప్‌లు అనే వర్గం ఆధీనంలో ఉండేవి. షరాప్‌లు నిర్వహించే హుండీలపై ఆధారపడి నాటి రుణవిధానం ఉండేది. గుజరాత్, ఆఫ్రికాల మధ్య జరిగే విదేశీ వాణిజ్య గురించి బార్బోసా రాశాడు. మలక్కాకు భారతదేశం నుంచి మిరియాలు, పసుపు, నల్లమందు, వస్త్రాలను ఎగుమతి చేసేవారు. మలబారు ప్రాంతంలో మోప్లాలు విదేశీ వాణిజ్యంలో ఆధిపత్యాన్ని కలిగి ఉండేవారు. వ్యవసాయంలోని మిగులును పట్టణాల్లో వినియోగించడం, విదేశీ వృత్తిపనివారు వృత్తి నైపుణ్యాలను తేవడం, బానిస వ్యవస్థ ద్వారా శ్రమశక్తి అధికంగా లభించడం లాంటి కారణాల వల్ల పట్టణ ఆర్థిక వ్యవస్థలో మార్పులు చోటుచేసుకున్నాయి. బానిసల వలస, జీవన విధానం గురించి ఇసామీ తన రచనల్లో వివరించాడు.
గ్రామీణ ఆర్థిక
వ్యవస్థ
                   
గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పెద్ద ముఖద్దమ్, చిన్న భూస్వాములైన కుట్స్ (Khuts) ఉన్నతమైన జీవితాన్ని గడిపేవారు. మిగిలిన రైతులు, కౌలు రైతులు, కూలీలు, దుర్భర జీవితాన్ని అనుభవించేవారు. చైనా యాత్రికుడైన వాంగ్‌తైలీన్ ఆరోజుల్లో ఒరిస్సా ప్రాంతంలో జీవన ప్రమాణం అతి తక్కువగా ఉండేదని పేర్కొన్నాడు. బెంగాల్‌లోని ధరలు ఇతర ప్రాంతాల ధరల కంటే తక్కువగా ఉండేవని అతడు రాశాడు. సుల్తానులు రైతులకు తక్కావీ రుణాలు మంజూరు చేసేవారు. మహ్మద్ బీన్ తుగ్లక్ కాలంలో రైతులకు షోందార్ రుణాలు (తక్కావీ) మంజూరు చేశాడు. ఆహార పంటలతోపాటు వాణిజ్య పంటలు ప్రోత్సాహం లభించింది. ఫిరోజ్‌ షా తుగ్లక్ తక్కావీ రుణాలను రద్దుచేశాడు.
 
 
 
 
 

ISHA SEARCH ENGINE